‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించి చెప్పగానే ఏమీ ఆలోచించకుండా తన కుమారుడు మంచు విష్ణు ఓకే అనేశాడని మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. తమ కుటుంబానికి సినిమానే ఊపిరి అని మంచు మోహన్ బాబు అన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పొట్ట చేతబట్టుకుని వచ్చి నటుడిగా, నిర్మాతగా సంపాదించుకుని ఇంతవాడినయ్యానన్నారు. సంపాదించిన దాంట్లో కొంత విద్యాసంస్థలకు ఖర్చు పెట్టి తోచినంతలో కొందరికి ఉచిత విద్యనందిస్తున్నానన్నారు. ఆయన నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఈనెల 18న విడుదల కానుండడంతో నిన్న నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. సినిమా అంటేనే రిస్క్ అన్నారు. డైమండ్ రత్నబాబు కలిసి కథ చెప్పగానే సినిమాను ఓకే చేశానని తెలిపారు. వెంటనే విష్ణుకు ఫోన్ చేసి సన్ ఆఫ్ ఇండియా సినిమా చేయాలనుకుంటున్నట్టు చెబితే ఓకే అనేశాడని చెప్పారు. మామూలుగా అయితే ‘ఆలోచిద్దాం’ అని చెప్పే విష్ణు.. ఈ సినిమా గురించి చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఓకే అన్నాడని, లోగో కూడా డిజైన్ చేసి పంపించాడని గుర్తు చేశారు. ఒకవేళ విష్ణుగానీ నో అని ఉంటే ఈ సినిమా చేసే వాడినే కాదని మోహన్ బాబు అన్నారు. ఇదిలావుంటే అప్పట్లో సుందర్ అనే ఒక టాప్ రచయిత 50 దాకా కథలు చెప్పారని, అందులో తనకేదీ నచ్చలేదని గుర్తు చేశారు. చివరగా ఒకే ఒక్క కథ చెప్పమని అడగడంతో.. ఆయనోకథ వినిపించారని, అది బాగా నచ్చేసిందని తెలిపారు. అయితే, అప్పటికే ఆ కథతో కన్నడలో వచ్చని సినిమా ఫ్లాప్ అయిందని ఆయన చెప్పినా.. మేము రిస్క్ చేసి ముందుకే వెళ్లి హిట్ కొట్టామన్నారు. రిస్క్ చేయాలని తాను నమ్ముతుంటానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa