![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 06:00 PM
హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
'తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు, సంస్కృతికి గర్వకారణమైన పొట్టి శ్రీరాములు గారు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష వారి నిస్వార్థ త్యాగానికి, తెలుగువారికి గర్వకారణంగా నిలుస్తున్నారు. కొత్త రైల్వే టర్మినల్ ఏర్పాటు ద్వారా తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనలో అదనపు ప్రయోజనం చేకూరింది. తెలంగాణ రైజింగ్ దార్శనికతకు ఇదెంతగానో తోడ్పడుతుంది. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న తమ లక్ష్య సాధనకు ఈ కొత్త రవాణా కేంద్రం ఉపయుక్తంగా చేశారు. అందుకు రైల్వే మంత్రి గారికి నా అభినందనలు.
తెలుగు ప్రజల కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్కు వారి పేరును పెట్టి గౌరవించుకోవలసిన అవసరం ఉంది. అది వారి అసమాన అంకిత భావానికి నివాళిగా భావిస్తున్నాం. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును మార్చాలని కోరుతున్నాం. ఈ విషయంలో మీరందించే సహకారం ఒక గొప్ప అడుగు అవుతుంది. తెలంగాణ ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలందరూ దీనిని ఎంతగానో అభినందిస్తారు. మా విజ్ఞప్తి విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.' అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
కాగా, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. పొట్టి శ్రీరాములు బదులుగా సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములుకు కూడా సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని తాజాగా.. రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.