|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 05:45 PM
తెలంగాణలో రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా మారిపోయాయి. అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. తాజాగా.. కార్యకర్తలతో మాట్లాడిన గులాబీ బాస్ కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసేనని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని.. ఎవరిని కదిలించిన కేసీఆర్ సర్కారే మంచిగుండే అని చెప్తున్నారని.. సింగిల్గానే అధికారంలోకి రానున్నట్టు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే క్రమంలో గులాబీ కార్యకర్తల్లో మరింత ధైర్యం నింపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. "నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు. కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు పోయినా రప్పించి మరీ.. అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కిసాబ్ మొత్తం చూస్తాం. ఊరుకునే బాపతి కాదు. ఇదివరకు ఉన్న కథ వేరు.. ఇప్పుడున్న కథ వేరు." అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపుతూనే.. పోలీసులకు ఇన్డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.
మరోవైపు.. రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని.. అందరికీ కేసీఆర్ గుర్తుకొస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం ఇస్తున్నామని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్.. 5 డీఏలు బాకీ ఉందని తెలిపారు. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని యువత బాధ పడుతోందన్నారు. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న నిర్వహించబోయే ఆవిర్భావ సభకు అందరూ కదిలి రావాలని కేటీఆర్ కోరారు.