|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 10:26 PM
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, 'ప్రపంచ యాత్రికుడు'గా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ, హిందూ ధర్మ భావాలను దెబ్బతీస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం అన్వేష్కు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పోలీసులను కలిసిన అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. అన్వేష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్వేష్ హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. 'నీచంగా మాట్లాడుతున్న అన్వేష్కు 2.5 మిలియన్ల సబ్స్క్రైబర్లను ఇచ్చింది మనమే. అతడికి వచ్చే ప్రతి రూపాయి మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు వారి నుంచే వెళ్తోంది. అలాంటి వ్యక్తి మన సంస్కృతిని విమర్శిస్తే సహించవద్దు' అని వ్యాఖ్యానించారు. తక్షణమే అతడి యూట్యూబ్ ఛానల్ను అందరూ 'అన్సబ్స్క్రైబ్' చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
అన్వేష్పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదైంది. గతంలో సీతమ్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపగా.. ఇప్పుడు మరిన్ని కేసులు తోడవ్వడం గమనార్హం. కేవలం దేవుళ్లే కాకుండా.. ప్రముఖ నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కూడా అన్వేష్ విచక్షణ కోల్పోయి పచ్చి బూతులతో విమర్శలు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అమ్మాయిల దుస్తుల విషయంలో శివాజీ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ఆయన వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తక్షణమే భారత్కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ సంస్కృతిని, మతాచారాలను కించపరుస్తున్న అతడిని 'దేశద్రోహి'గా ప్రకటించాలని వారు కోరుతున్నారు. మంచిని చెప్పాలనుకుంటే పద్ధతిగా చెప్పవచ్చని, కానీ విజ్ఞానం పేరుతో విద్వేషం చిమ్మడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఒకవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున అన్ఫాలో చేస్తున్నా.. అన్వేష్ మాత్రం తగ్గకుండా మరో వీడియోలో శాపనార్థాలు పెడుతూ రెచ్చగొట్టడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.