|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 08:12 PM
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి మందుబాబులకు హెచ్చరికలు చేశారు. ‘కొత్త ఏడాది వేడుకలకు ఇది నా చివరి మెసేజ్’ అంటూ ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేయడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఆయన హెచ్చరించారు. ‘‘ఈరోజు ఫెయిల్ కావడానికి ప్రయత్నించండి.. ఒకవేళ మీరు పాస్ అయితే చంచల్గూడ జైలుకు వెళ్తారు.. అక్కడ ఉచిత భోజనం కూడా ఉంటుంది’ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.
‘చదువుకు సంబంధించి పరీక్షలలో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.., కానీ డ్రంకె డ్రైవ్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మీటర్ 35 (బీఏసీ) దాటితే మాత్రం ఔట్ అవుతారు’ అని మందుబాబులను ఆయన హెచ్చరించారు. ‘పరీక్షల్లో ఫెయిలైతే ఏడాది మాత్రమే పోతది... కానీ రోడ్డు మీద తేడా కొడితే జీవితం ఆగమయితది’ సజ్జనర్ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. .
‘మన రహదారులు రక్తసిక్తం కావడానికి మేము అంగీకరించేది లేదు.. బాధ్యత కంటే మద్యం ఎక్కువని యువత భావిస్తే, చట్టపరంగా చర్యలు తప్పవు.. ..నూతన సంవత్సరం కానుకగా ఆసుపత్రి బిల్లులు చెల్లించడం లేదా కేసు నమోదు చేయించుకోవడం కాకుండా.. సురక్షితంగా ఇంటికి వెళ్లడం మంచిది’ ఆయన హితవు పలికారు. తాగి వాహనం నడిపితే హైదరాబాద్ పోలీసులు ఏమాత్రం సహించరని సజ్జనార్ పునరుద్ఘాటించారు. అందరికీ 2026 న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని మొత్తం 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. వేగంగా వాహనం నడపడం, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. రాత్రి 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలవుతాయని, అర్ధరాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు.
సమయం మించి వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బ్యాక్ డోర్లో మద్యం విక్రయించొద్దని మద్యం దుకాణాలకు కూడా నగర కమిషనర్ సూచించారు. క్యాబ్లు, ఆటో డ్రైవర్లు రైడ్ నిరాకరిస్తే ఉపేక్షించబోమని అన్నారు. ఇక, నగరంలో పలు ఫ్లైఓవర్లను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు మూసివేశారు.