|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 10:36 PM
తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించబోతోంది. యాసంగి సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 'రైతు భరోసా' నిధులను సంక్రాంతి పండుగ నాటికే వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తును వేగవంతం చేశాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఈ సాయాన్ని సకాలంలో అందించి సానుకూలతను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
గతంలో మాదిరిగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రైతు బంధు' పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 'రైతు భరోసా'గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సాగులో ఉన్న భూములను ఖచ్చితంగా గుర్తించేందుకు వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సర్వే విజయవంతమైంది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు సాగు వివరాలను సేకరిస్తున్నారు. గత ఏడాది యాసంగిలో సుమారు 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సాగు లెక్కలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన భూములన్నింటికీ సంక్రాంతి లోపే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
గత వానకాలం సీజన్లో ప్రభుత్వం సుమారు 69.40 లక్షల మంది రైతులకు రూ. 8,744.13 కోట్ల నిధులను పంపిణీ చేసింది. ఈసారి యాసంగి కోసం కూడా సుమారు రూ. 9 వేల కోట్ల వరకు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. సీఎం రేవంత్రెడ్డి ఈ నిధుల విడుదలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పండుగ పూట రైతుల చేతికి డబ్బులు అందితే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి, రుణమాఫీ అమలు తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక సాయం కోసం తెలంగాణ రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సంక్రాంతి కల్లా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయితే.. పండుగ సంబరాలు రెట్టింపు కానున్నాయి.