|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 07:49 PM
పచ్చని ప్రకతి మధ్యలో.. గుట్టలు, కొండలను చుట్టేస్తూ.. చల్లగాలి ఒంటిని తాకుతుంటే.. పైన ఆకాశం.. కింద నీరు.. కనుచూపు మేర పచ్చదనం.. వీటన్నింటిని చూస్తూ నెమ్మదిగా సాగే బోటు ప్రయాణం.. ఆహా ఇది కదా స్వర్గం అనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులకు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అనుభూతి పొందాలంటే.. సాగర్ నుంచి శ్రీశైలం బోటులో వెళ్లాల్సిందే. పర్యాటక శాఖ ఈ బోట జర్నీని మళ్లీ తిరిగి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
తెలంగాణ టూరిజం బోర్డ్ పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు సూపర్ న్యూస్ చెప్పింది. నల్లమల అడవుల అందాల మధ్య, కృష్ణా నదిలో బోటులో ప్రయాణించాలనుకునే వారికి ఎగిరి గంతేసే వార్త అని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కొనసాగే లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 22 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించింది.
ఈ బోటు జర్నీ నల్లమల అటవీ అందాలను దగ్గర నుంచి చూస్తూ.. కృష్ణా నది పరవళ్లను ఆస్వాదించేలా సుమారు 6 గంటల పాటు సాగనుంది. సాగర్ నుంచి శ్రీశైలం మధ్య దూరం 110 కి.మీ. కాగా.. బోటులో ప్రయాణిస్తే.. ఆరు గంటల్లో చేరుకుంటారు. బోటులోనే ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తారు. కృష్ణా నది మధ్యలో.. బోటులో కూర్చుని.. భోజనానన్ని ఆస్వాదిస్తే వచ్చే కిక్కే వేరు అంటున్నారు పర్యాటకులు.
ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ పర్యాటక శాఖ.. లాంచీ జర్నీని తిరిగి ప్రారంభించబోతుంది. నవంబర్ 22 నుంచి ఈ జర్నీ ప్రారంభం కాబోతుంది. దీనిలో భాగంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి రావడానికి పెద్దలకు అయితే రూ.3,250, పిల్లలకు ర.2,600 టికెట్ ధరగా నిర్ణయించారు. అలా కాకుండా కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లడానికి మాత్రమే అయితే పెద్దలకు 2,000 రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయలు టికెట్ ధరగా తెలంగాణ పర్యాటక శాఖ నిర్ణయించింది.
ఈ లాంచీ ప్రయాణం నాగార్జున సాగర్ నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత నందికొండ మీదుగా.. ఏళేశ్వరం, సలేశ్వరం ప్రాంతాలను దాటుతూ.. తూర్పు కనుమలు, నల్లమల అందాలను తాకుతూ సాగుతుంది. ఈ నెల 22 నుంచి.. ప్రతి శనివారం టికెట్లు బుక్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ బోటు జర్నీప్రతి వారం అందుబాటులో ఉండాలంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లు బుక్ చేసుకోవాలి. అప్పుడు ప్రత్యేకంగా సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది.