|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 08:13 PM
మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కబ్జాలపై ఆమె స్పందించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.మహేశ్వరంలోని రావిర్యాల, మంత్రాల చెరువులలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆమె నిలదీశారు. మున్ముందు ఈ కబ్జాలకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తామని, వారు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. హైడ్రా ప్రత్యేకంగా సర్టిఫైడ్ ఏజెన్సీగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.కబ్జాలకు సంబంధించిన వివరాలను హైడ్రాకు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళతారేమోనని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని ఆమె అన్నారు.