|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:22 PM
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రసిద్ధ బోండీ బీచ్ వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన సాజిద్ అక్రమ్ అని తేలడంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 16 మంది మరణించగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిందితుడి పూర్తి వివరాలను వెల్లడించారు.
50 ఏళ్ల సాజిద్ అక్రమ్ పక్కా హైదరాబాద్ నివాసి. ఇక్కడ అతనికి ఉన్న సంబంధాలను పోలీసులు లోతుగా విచారించారు. సాజిద్ హైదరాబాద్లోనే తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 1998 నవంబర్లో పైచదువుల నిమిత్తం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. సాజిద్ తండ్రి గతంలో రక్షణ రంగంలో పనిచేశారు. ఇతని సోదరుడు షాహిద్ ప్రస్తుతం పాతబస్తీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో ఒక యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న సాజిద్కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని పిల్లలు ఆస్ట్రేలియా పౌరులే అయినప్పటికీ.. సాజిద్ మాత్రం ఇప్పటికీ భారత పాస్పోర్టునే వినియోగిస్తుండటం గమనార్హం.
బోండీ బీచ్ దాడిలో ఏం జరిగింది..?
ఆదివారం యూదులు జరుపుకునే పవిత్రమైన హనుక్కా వేడుకల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. బీచ్ కార్యక్రమంలో ఉన్న ప్రజలపై సాజిద్ , అతని కుమారుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవ్వగా.. అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న సమయంలో సాజిద్పై ఎలాంటి నేరారోపణలు లేవు. ఆస్ట్రేలియా వెళ్ళాకే అతను ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పోలీసులు సాజిద్ గత 27 ఏళ్ల చరిత్రను తవ్వితీశారు. ఈ మూడు దశాబ్ద కాలంలో సాజిద్ కేవలం ఆరుసార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడు. చివరిగా 2022లో హైదరాబాద్ను సందర్శించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను స్వదేశానికి రాలేదు. హైదరాబాద్లో ఉంటున్న అతని కుటుంబ సభ్యులు సాజిద్ ఉగ్రవాద చర్యల గురించి తమకేమీ తెలియదని పోలీసులకు తెలిపారు. చాలా కాలంగా అతనితో సంబంధాలు తక్కువగానే ఉన్నట్లు చెప్పారు. సాజిద్కు సంబంధించి మరిన్ని అంతర్జాతీయ సంబంధాల గురించి తెలంగాణ డీజీపీ కార్యాలయం ఆస్ట్రేలియా అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.