|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:49 PM
అమీన్పూర్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న మహా జాతర సందర్భంగా సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రణాళికా ప్రకారం నిర్దేశించిన పనులను పూర్తి చేసి విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతర సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14 నుండి 18వ తేదీ వరకు శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా స్థానిక భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఐదు రోజులపాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఈవో శశిధర్మం ఆదేశించారు. నిరంతర నిఘా కోసం 50 కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రద్దీ నివారణకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. దేవాలయం ఆవరణలో గల కబ్జాలను 24 గంటల్లోగా తొలగించాలని ఎమ్మార్వో వెంకటేష్ ను ఆదేశించారు. ఇదే అంశంపై గతంలోనూ తెలపడం జరిగిందని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దర్శనాల అంశంలో వీఐపీల పేరుతో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని.. భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర ఏర్పాట్లపైన ఈనెల 12వ తేదీన మరో మారు సమీక్ష సమావేశం నిర్వహించనున్నామని.. అప్పటి లోపు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తహసిల్దార్ వెంకటేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిఐ నరేష్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.