రాఖీ పౌర్ణమి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కి కాసుల వర్షం కురిపించింది. పండగ సందర్భంంగా రికార్డు స్థాయిలో ప్రయాణికులను ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేరవేసింది. నిన్న ఒక్కరోజే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 63.86 లక్షల మంది బస్సుల్లో ప్రయాణాలు సాగించారు. మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 41.74 లక్షల మంది మహిళలు వినియోగించారు . 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారు.
రాఖీ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు రాబడి రాగా.. నగదు చెల్లింపు టికెట్ల ద్వారా మరో రూ.15 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక్క రోజులోనే ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఆర్టీసి తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని.. ఉద్యోగులు రాత్రి, పగలు నిరంతరం శ్రమించారన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించి ప్రయాణికులను తరలించడంలో విజయవంతమయ్యారన్నారు.
రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బంది నిరంతరం శ్రమించారని ఆర్టీసి డ్రైవర్లు , కండక్టర్లకు కూడా ఫీల్డ్లోనే బస్సుల్లో వారి సోదరీమణులు రాఖీలు కట్టారన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సోదరులకు రాఖీ కట్టారన్నారు. వారందరిని మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా ఆర్టీసీ అమలు చేస్తుందన్నారు. ఆర్టీసీని ఆదరిస్తోన్న, ప్రొత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికి మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa