కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమె రాక తర్వాతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్లు హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. తాజాగా ఆమె పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవుల భర్తీపై మీనాక్షి నటరాజన్ దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోని నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నవారితో ఒక కేటగిరీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీలో చేరినవారితో మరో కేటగిరీ.. ఇక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండా కప్పుకున్నవారితో ఇంకో కేటగిరీని ఏర్పాటు చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీసో పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ 3 గ్రూపుల్లో ఉన్న నేతలకు కేటగిరీల వారీగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం 10 ఏళ్లు పార్టీలో ఉన్నవారి జాబితా ఇవ్వాలని పీసీసీ వర్గాలను మీనాక్షి నటరాజన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో కొత్తగా పార్టీలో చేరిన నేతల్లో కొంత ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పనితీరుపై మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ వేర్వేరుగా సమావేశం అయ్యారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి పనితీరు ఏంటో తనకు తెలుసని.. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేసినట్లు నటిస్తున్నారో తనకు తెలుసని పేర్కొన్నారు. పార్టీ కోసం సమయం కేటాయించాలని.. పార్టీలో అంతర్గతంగా ఉన్న విషయాలను బయట చర్చించొద్దంటూ మీనాక్షి నటరాజన్ మరోసారి అందరికీ తీవ్ర హెచ్చరికలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa