ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 06:43 PM

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్‌ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే ఏపీ, తెలంగాణ నుంచి వందే భారత్ స్లీపర్స్ పరుగులు తీయనున్నాయి. తొలివిడతలోనే తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లకు ఆమోదం లభించింది. ఇందు కోసం రెండు మార్గాలు ఫిక్స్ చేశారు. అలానే టికెట్ ధర కూడా ప్రకటించారు. ఆ వివరాలు..


తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లను ఆమోదించిన కేంద్రం.. అవి ప్రయాణించే రూట్లు, టికెట్ ధరను కూడా ఫిక్స్ చేసింది. తెలంగాణ నుంచి ఒకటి, ఏపీ నుంచి మరొక వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్, విజయవాడ నుంచి ఇవి నడవనున్నాయి. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి తొలి వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం 1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజు సమయంలో చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అలానే ఏపీ విషయానికి వస్తే.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ రైలు ఏర్పాటుపైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


సికింద్రాబాద్ టూ ఢిల్లీ రూట్ ఇదే..


సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందే భారత్ రైలు రూట్‌ని ఫిక్స్ చేశారు. ఈ స్లీపర్ రైలు.. ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగపూర్, బల్హార్షా, కాజిపేట్ జంక్షన్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఇక రూట్‌లో వెళ్లే వందే భారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీ కోచ్ ఛార్జీ రూ.3600గా, సెకండ్ ఏసీ కోచ్ ఛార్జీ రూ.4800గా, ఫస్ట్ ఏసీ కోచ్ ఛార్జీ దాదాపు రూ.6000 ఉంటుంది. న్యూఢిల్లీ నుండి రాత్రి 08:50 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు.. మరుసటి రోజ రాత్రి 08:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేలా ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇది పట్టాలెక్కితే ఒక్క రోజులోనే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ చేరుకోవచ్చు.


ఇక ఏపీ నుంచి నడిచే వందే భారత్ స్లీపర్ రైలు గురించి కూటమి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రైలు పట్టాలెక్కిన తర్వాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కేటాయింపుపై తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అంతేకాక ప్రస్తుతం విజయవాడ నుంచి వరంగల్ మీదుగా రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్‌ను అయోధ్యకు కేటాయించేలా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ రైలు అందుబాటులోకి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా, సులభంగా అయోధ్య, వారణాసి వెళ్లవచ్చు అంటున్నారు. ఈరెండు వందేభారత్ రైళ్లకు ఆమోదముద్ర వేస్తూ వచ్చే వారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa