ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఊరంతా మాదే.. ఖాళీ చేసి వెళ్లిపోండి’.. లబోదిబోమంటున్న గ్రామస్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:37 PM

తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పల్ నవేగామ్ గ్రామంలో భూ మాఫియా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన వందకు పైగా కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ భూమి, ఇళ్లను ఖాళీ చేయాలంటూ ముగ్గురు వ్యక్తులు రెండు సంవత్సరాలుగా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామీణులు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ)ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.


ఆసిఫాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్, చరణ్ దాస్, మనోజ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇప్పల్ నవేగామ్ గ్రామానికి చెందిన భూమి తమదేనని, తమ పేరున పట్టా ఉందని గ్రామస్తులతో ఇళ్లను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నారు. ఇలా వారు గత రెండు సంవత్సరాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆర్‌డీఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ ముగ్గురు వ్యక్తులు తమ పలుకుబడిని ఉపయోగించి.. గ్రామస్తులను మానసికంగా వేధిస్తున్నారని, కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల గ్రామస్థులు నిరంతరం భయంతో బతుకుతున్నారని.. తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


బాధితుల వాదన ప్రకారం.. వారు నివసిస్తున్న ఈ స్థలంలో గత 200 సంవత్సరాలుగా వారి పూర్వీకులు నివసిస్తున్నారు. తరతరాలుగా ఇదే గ్రామంలో నివాసముంటూ.. ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు వంటి అన్ని రకాల ప్రభుత్వ పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నట్లు గ్రామస్తులు రుజువులు చూపిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని, అన్ని రకాల హక్కులు తమకే ఉన్నాయని వారు బలంగా చెబుతున్నారు. తాము నివసిస్తున్న భూమిపై అసలు ఎలాంటి వివాదం లేదని.. అక్రమంగా ఆ ముగ్గురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.


భూ మాఫియా బెదిరింపుల వల్ల గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా కూడా నిర్వహించారు. అధికారులు తక్షణమే స్పందించి, బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమ భూములకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa