భారత్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ వైదొలిగారు. అయితే, ఆమె వైదొలగడంపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. మిల్లా మాగీ కొన్ని ఆరోపణలు చేశారని, వాటిని ఖండిస్తున్నామని సంస్థ ఛైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే అన్నారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్రిటిష్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవని ఆమె కొట్టిపారేశారు.ఈ నెల ఆరంభంలో, మిల్లా మాగీ తన తల్లి, ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి తప్పుకోవాలని సంస్థను అభ్యర్థించినట్లు జూలియా మోర్లే తెలిపారు. "మిల్లా పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాము. ఆమె కుటుంబ సభ్యుల క్షేమమే మాకు మొదటి ప్రాధాన్యత. అందుకే వెంటనే ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం" అని మోర్లే వివరించారు.మిల్లా మాగీ పోటీల నుంచి వైదొలిగిన అనంతరం, మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో మొదటి రన్నరప్గా నిలిచిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చారని సంస్థ వెల్లడించింది. మిస్ షార్లెట్ భారత్కు చేరుకున్నారని, మిస్ వరల్డ్ కుటుంబ సభ్యులు ఆమెను సాదరంగా ఆహ్వానించి పోటీలలో పాల్గొనేందుకు అనుమతించారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఈ పోటీలలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.కొన్ని యూకే మీడియా సంస్థలు, మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని జూలియా మోర్లే ఆవేదన వ్యక్తం చేశారు. అవి పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మాగీ స్వయంగా వ్యక్తం చేసిన భావాలు, ఎలాంటి ఎడిటింగ్ చేయని వీడియో క్లిప్లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ వీడియోలలో మిల్లా ఎంతో ఆనందంగా, కృతజ్ఞతా భావంతో మాట్లాడారని, ఈ అనుభవాన్ని మెచ్చుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయని మోర్లే వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa