అవి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడ ఫేక్ ఎల్ ఆర్ ఎస్లు సృష్టించారు కబ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్తో భవన అనుమతులు తీసుకున్నారు. 5 అంతస్తుల భవనాలు నిర్మాణం జరిగాక మణికొండ మున్సిపల్ అధికారులు ఆ స్థలాలు ప్రజావసరాలకు ఉద్దేశించినవని చెబుతూ తమ పరిధిలో ఉన్న భవన అనుమతులు రద్దుచేశారు. నేరుగా హెచ్ ఎం డీఏ నుంచి అనుమతులు తీసుకున్నందున మరో భవన నిర్మాణ అనుమతులు రద్దుచేయాలంటూ హెచ్ ఎం డీఏకు మణికొండ మున్సిపల్ అధికారులు లేఖ రాశారు. ఇవన్నీ అయ్యేలోపు గృహప్రవేశం చేసేయాలన్నంత వేగంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఇంతలో అక్కడి నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల్లో రెండు 5 అంతస్తుల భవనాల నిర్మాణాలు జరిగిపోతున్నాయని... ఆ అనుమతులను రద్దు చేసినా నిర్మాణాలు ఆగడంలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక హైడ్రాకు ఫిర్యాదు వచ్చిందని తెలుసుకున్న నిర్మాణదారులు... కోర్టును ఆశ్రయించారు. ఇదేదో విషయం తెలుసుకోవాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ పనులను వెంటనే ఆపాలని హైకోర్టు నేరుగా చెప్పలేదన్న నెపంతో నిర్మాణ పనులను మరింత వేగం చేశారు. నిర్మాణాలు చేపట్టిన వారితో పాటు.. అక్కడి నివాసితులను, ఫిర్యాదు దారులను హైడ్రా పిలిపించి విచారించింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పనులు జరకుండా అ రెండు భవనాలను సీజ్చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా బుధవారం ఆ రెండు భవనాలను సీజ్ చేసి ఫెన్సింగ్ వేసింది.
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నెక్నాంపూర్ విలేజ్లోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ హెచ్ ఎండీఏ లే ఔట్ అది. ఇందులో ప్రజావసరాలకు ఉద్దేశించి 300ల గజాల చొప్పున 4 ప్లాట్లు కేటాయించారు. ఆ నాలుగుతో పాటు.. పక్కనే ఉన్న మరి కొంత కలిపి దాదాపు 1500ల గజాల వరకూ స్థలాన్నిచూపించి.. ఫేక్ ఎల్ ఆర్ ఎస్తో మణికొండ మున్సిపాలిటీలో భవన నిర్మాణ అనుమతులు పొందారు. ఇక్కడ జీ ప్లస్ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇదే లే ఔట్లో సెప్టిక్ ట్యాంకు/ పార్కు స్థలంగా కేటాయించిన దాదాపు 2 వేల గజాల స్థలంలో మరో ప్రబుద్ధుడు ఎల్ ఆర్ ఎస్తో పాటు.. భవన నిర్మాణ అనుమతులను నేరుగా హెచ్ ఎండీఏ నుంచే తీసుకున్నారు. ఇక జెట్ స్పీడులో నిర్మాణాలు చేస్తున్నారు. 5 అంతస్తుల భవనాలు వెలిశాక.. ఈ రెండు నిర్మాణాలు జరుగుతున్న స్థలాలు ప్రజావసరాలకు ఉద్దేశించినవని... ఫేక్ ఎల్ ఆర్ ఎస్తో ఒక భవన అనుమతి పొందారని.. మరొకటి హెచ్ ఎండీఏ ఇచ్చిందని చెబుతూ వాటి రద్దుకోసం ప్రయత్నించారు. మణికొండ మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతిని 2025లో రద్దు చేశారు. ఇలా పూర్వాపరాల పరిశీలన ఒక వైపు సాగుతోంది. హైకోర్టు ఈ విషయమై విచారించమని హైడ్రాను ఆదేశించింది. హైడ్రా విచారణ చేపట్టింది. ఎవరి పనిలో వారుండగా.. నిర్మాణదారులు మాత్రం నిరాటంకంగా.. మరింత వేగంగా పూర్తి చేసి.. గృహప్రవేశాలు కూడా చేసేయాలనే ఆలోచనతో నిర్మాణాల వేగాన్ని పెంచారు. ఇప్పుడా ఆ రెండు భవనాల నిర్మాణాన్ని హైడ్రా అడ్డుకుంది. జీహెచ్ ఎంసీ, రెవెన్యూ విభాగాలతో కలిసి హైడ్రా ఫెన్సింగ్ వేసి భవన నిర్మాణ పనులను ఆపేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa