ఏప్రిల్ 1కి ముందుగానే ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో వినియోగదారులకు తగిన రాయితీలు ఉంటాయి. ఈ విధానం టోల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు సహాయపడనుంది.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాన్ని కూడా గడ్కరీ వివరించారు. భారతదేశ జనాభాలో 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, అయితే ఇది జాతీయ ఆర్థిక వృద్ధికి 12 శాతం మాత్రమే దోహదపడుతుందని చెప్పారు. ‘‘మన రైతులు ఆహారాన్ని పండించే వారే కాకుండా, ఇంధన ప్రదాతలు కూడా అవుతారు’’ అని ఆయన అన్నారు. బయో ఇంధన ఉత్పత్తి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించే వ్యవసాయం అభివృద్ధి విధానాన్ని వివరించారు.
దేశవ్యాప్తంగా 400 బయో ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, వ్యవసాయ వ్యర్థాలను బయో-CNG మరియు బయో-బిటుమెన్లుగా మార్చడం, లాజిస్టిక్ ఖర్చులను 14-16 శాతం నుంచి 9 శాతానికి తగ్గించడం, గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలను డెవలప్ చేయడం, అధునాతన నిర్మాణ సాంకేతిక అమలు చేయడం వంటి కీలక కార్యక్రమాలను వెల్లడించారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాలు సరిపోతాయని గడ్కరీ అన్నారు.
![]() |
![]() |