ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండ ప్యాలెస్‌పై.. మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 07:42 PM

ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో పర్యటించాలని.. పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాలని సూచించారు. నెలలో నాలుగు రోజులు ప్రజాప్రతినిధులు పల్లె నిద్రలో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.


ఈ చర్చ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది. రుషికొండ ప్యాలెస్ గురించి మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ఆలోచనలు చేశారు. మొదట మంత్రులంతా రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించాలని చంద్రబాబు సూచించారు. మంత్రుల పర్యటన పూర్తైన తర్వాత ఏం చేద్దామనే దానిపై అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.


రుషికొండ భవనాలను మొత్తం 9.88 ఎకరాల విస్తీర్ణంలో ఏడు బ్లాక్‌లుగా నిర్మించారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం సుమారు 400-500 కోట్ల రూపాయలుగా చెప్తుంటారు. ఇందులో ఖరీదైన ఇటాలియన్ మార్బుల్, ఫర్నీచర్, షాండ్లియర్లు, షవర్లు వంటివి ఉపయోగించారు. అయితే రుషికొండ ప్యాలెస్‌ను వీఐపీల కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్తుండగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ తన వ్యక్తిగత వినియోగం కోసం నిర్మించారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తుంటారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రుషికొండ భవనాలను కూటమి సర్కారు ఏం చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


పర్యావరణానికి భంగం కలిగించేలా, అనుమతులు లేకుండా రుషికొండ ప్యాలెస్ నిర్మించారని విపక్షంలో ఉన్న సమయలో టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. ప్రస్తుతం ఈ పార్టీలు అధికారంలోకి రావటంతో ఈ రుషికొండ ప్యాలెస్‌ను అలాగే కొనసాగిస్తారా లేదా కూల్చివేస్తారా అనే చర్చ జరిగింది. అయితే వందలకోట్లు ప్రజా ధనం వెచ్చించి నిర్మించిన భవనాలు కావటంతో.. వీటిని పర్యాటక రంగం కోసం లేదా మ్యూజియంగా ఉపయోగించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్ సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులకు సూచించారు. సందర్శన తర్వాత మంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని తర్వాత రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com