![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 05:55 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. సభలో మాట్లాడిన.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ఖూనీ చేసిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టే బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌజ్లలో ఇంకా ప్రశాంతంగా ఉన్నారని, లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో 8 వేల హత్యలు, లక్ష దొంగతనాలు జరిగాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంతో పాలన సాగించిందని, తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలన అధికార దుర్వినియోగానికి నిదర్శనమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
పోలీస్ అధికారులు కూడా బీఆర్ఎస్ అధికార దాహానికి బలయ్యారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టు అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ చేయించిన పాపాలతో పోలీసులు విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసు వ్యవస్థను బీఆర్ఎస్ దారుణంగా వాడుకుందని కోమటిరెడ్డి మండిపడ్డారు.
గతంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు బీఆర్ఎస్ అవకాశం కూడా ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్పై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్రాన్ని ప్రతిపక్షం లేకుండా చేశారని.. అలాంటిది పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచివారు కాబట్టే బీఆర్ఎస్ నేతలు 15 నెలలుగా ఫామ్ హౌజ్లో ప్రశాంతంగా పడుకుంటున్నారని, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా.. నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క పరిస్థితి ఉంటుంది.. చూడండి అంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన కాామెంట్లు చేశారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వెయ్యి జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాదని కోమటిరెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.