![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 05:58 PM
భద్రాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఇరుక్కుని ఆరుగురు కార్మికులు ప్రాణాలు వదిలారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి.. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను వెంటనే వెలికి తీసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా.. అన్నది పరిశీలిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. అసలు ఈ భవనం ఎవరిది..? కూలిపోవటానికి కారణాలేంటీ..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే.. ప్రమాదం సమయంలో ఎంత మంది పని చేస్తున్నారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఐదంస్థుల భవనం కట్టేందుకు గానూ స్లాబ్లు వేయగా.. పలువురు కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భవనం పేకమేడలా ఉన్నచోటే మొత్తానికి మొత్తం కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనం కూలిన సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.కాగా.. మొదట జీ ప్లస్ టూ కోసమే పర్మిషన్ తీసుకుని.. ఏకంగా ఐదంతస్తులు మేర స్లాబులు నిర్మించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నాణ్యతా లోపం వల్లే కుప్పకూలి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.