|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:32 PM
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన నిధుల విషయంలో ఎట్టకేలకు ప్రతిష్టంభన తొలిగింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ అందినట్లు సమాచారం. గత రెండేళ్లలో విడుదల చేసిన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలను అందజేయాలని కేంద్రం కోరడంతో.. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆ సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల సుమారు రూ. 3 వేల కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగిసి.. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, నిధులను దశలవారీగా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకే జమ చేసేందుకు అంగీకరించింది. ఈ నెలాఖరు నాటికి మొదటి విడత నిధులు అందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
కేంద్ర నిధులు నిలిచిపోవడంతో గత ఏడాది కాలంగా గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస సౌకర్యాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ప్రత్యేక అధికారుల పాలనలో నిధుల కొరత వల్ల జీతాల చెల్లింపులు కూడా భారంగా మారాయి. కొన్నిచోట్ల అధికారులు అప్పులు చేసి మరీ అత్యవసర పనులు పూర్తి చేశారు. ఇప్పుడు నిధులు విడుదల కానుండటంతో పెండింగ్లో ఉన్న పనులు చకచకా పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రతి నెలా గ్రామ అవసరాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండనున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మారడం, పదవీకాలం ముగియడంతో పాత బిల్లులు నిలిచిపోయాయి. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి రానున్న నేపథ్యంలో.. కొత్త పాలకవర్గాలు తమ పాత బకాయిలను చెల్లిస్తాయని వారు ఆశిస్తున్నారు. తమ కష్టార్జితం తిరిగి వస్తుందనే నమ్మకంతో మాజీ సర్పంచులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.