|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:07 PM
చర్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ.. విజయశాంతి రెడ్డి సోదరుడు చిరంజీవి ఆరోపించారు. ఈ మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి చిరంజీవి వచ్చారు. విజయారెడ్డి ఆత్మహత్యపై కొన్ని ఛానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఛానెళ్ల మీద ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్లాలని మేడిపల్లి పోలీసులు సూచించినట్లు తెలిపారు. విజయారెడ్డి. ఆమె పిల్లలు చనిపోవటంతో తామంతా డిప్రెషన్లో ఉన్నామని ఆయన చెప్పారు.
ఆఫీస్ పని మీద విజయారెడ్డి చాలా బిజీగా ఉండేదని.. టీమ్ లీడర్ కూడా కావటంతో తన కింద ఉన్న 14 మంది ఉద్యోగులతో పని చేయించేదన్నారు. దీంతో డిప్రెషన్లో ఉండేదని చిరంజీవి తెలిపారు. విజయారెడ్డి, పిల్లల మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని.. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద పరువు నష్టం దావా వేస్తామని చిరంజీవి తెలిపారు. కుటుంబసభ్యులను కోల్పోయి డిప్రెషన్లో ఉన్న తమ మీద తప్పుడు కథనాలు ప్రసారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు విజయారెడ్డి కుటుంబం ఆత్మహత్యకు.. డిప్రెషన్ కారణమని పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు విశాల్ రెడ్డి, కుమార్తె చేతనా రెడ్డిని.. విజయశాంతి రెడ్డి పూర్తిగా తన కంట్రోల్లోనే పెట్టుకుందని..ఆమె చెప్పినట్లే పిల్లలు కూడా వినేవారని అన్నారు. తను చనిపోతే తన కొడుకు, కూతురు ఒంటరి అవుతారనే కారణంతోనే పిల్లలను కూడా ఆత్మహత్యకు ఒప్పించిందని పోలీసులు వివరించారు. అయితే విజయశాంతి రెడ్డి డిప్రెషన్కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.
మరోవైపు విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి - ఘట్కేసర్ మధ్య రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా విజయశాంతి రెడ్డి ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసకుందనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది.