మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్పై తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతపక్షాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుంభకోణానికి తెరతీసిందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేసి చిక్కుల్లో పడ్డారు. తమపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మన్నె క్రిశాంక్కు మెయిన్హర్డ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆరోపణలు చేశారని ఆ సంస్థ పేర్కొంది. క్రిశాంక్ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని.. ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరంగా న్యాయపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కాగా, ఈ నోటీసులపై మన్నె క్రిశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై తాను పెట్టిన పోస్ట్లను తొలగించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. నోటీసులు విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సింగపూర్ సంస్థ ఇచ్చిన నోటీసులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందని తెలిపారు. రూ. 3 వేల కోట్ల కుంభకోణంలో మెయిన్హార్ట్కు పాకిస్థాన్ రెడ్ వారెంట్ నోటీసులు జారీ చేసింది నిజం కాదా..? ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది నిజం కాదా..? అని క్రిశాంక్ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, మూసీ కాంట్రాక్టర్ సింగపూర్ కంపెనీ నోటీసులు, పోలీసు కేసులకు తాను భయపడమని క్రిశాంక్ తేల్చిచెప్పారు.
మూసీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కాంట్రాక్టును మెయిన్హార్ట్కు అప్పగించడంపై క్రిశాంక్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘రూ.3వేల కోట్ల కుంభకోణంలో రెడ్కార్నర్ నోటీసులు జారీ అయిన సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ కాంట్రాక్టు కట్టబెట్టింది’ అని ఎక్స్లో ఆయన బుధవారం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ సుమారు 267 కిలోమీటర్లు ప్రయాణం సాగించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్లోని లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ వద్ద ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణం మొదలుపెడుతుంది. మూసీ నది కాల క్రమంలో మురికి కూపంగా మారడంతో ప్రక్షాళన దిశగా గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తొలుత 1997లో నాటి టీడీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కానీ, అది ముందుకు సాగలేదు. మళ్లీ 2005లో కాంగ్రెస్ కూడా ప్రతిపాదన చేసినా ముందుకు కదల్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa