ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాన్ కార్డు ఆధార్ కార్డ్ లింక్ కు.. డిసెంబర్ 31 డెడ్‌లైన్

international |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 10:40 PM

 పాన్‌కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి శాశ్వత ఖాతా సంఖ్య పొందిన వారు తమ పాన్‌కార్డును ఆధార్ నంబర్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 2025 డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2024 అక్టోబర్ 1 లేదా అంతకంటే ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని సమర్పించి పాన్‌ తీసుకున్న వారు ఈ గడువు లోపు ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది, లేకపోతే వారి పాన్‌కార్డు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.


ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ అనేది ఆధార్ కార్డు జారీ కాని వారికి తాత్కాలికంగా అందించే 28 అంకెల సంఖ్య. ఈ ఐడీతో పాన్‌ కార్డు తీసుకున్న వారు, తమ ఆధార్ కార్డు జారీ అయిన తర్వాత దాన్ని పాన్‌తో లింక్ చేయడం ద్వారా తమ వివరాలను ధ్రువీకరించాలి. ఈ చర్య ద్వారా నకిలీ పాన్‌ కార్డులను అరికట్టడం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో పాన్‌-ఆధార్ లింకింగ్ గడువు 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ వాడిన వారికి అదనపు సమయం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి జరిమానా లేకుండా ఈ అవకాశాన్ని అందిస్తున్నారు.


పాన్‌-ఆధార్ అనుసంధానం కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌ను (www.incometax.gov.in) ఉపయోగించవచ్చు. ముందుగా పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. లేదా రిజిస్టర్ కావాలి. అక్కడ 'లింక్ ఆధార్' పై క్లిక్ చేయాలి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు వంటి వివరాలను నమోదు చేయాలి. ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసి సమర్పించాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయొచ్చు. ఇంకా ఎలాంటి పెనాల్టీ లేదు. ఆన్‌లైన్ సౌలభ్యం లేని వారు సమీపంలోని పాన్ సర్వీసు సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే, సాధారణ పాన్‌-ఆధార్ లింకింగ్ కోసం 2023 గడువు ముగిసిన తర్వాత రూ.1,000 జరిమానా విధిస్తున్నారు. ఎన్‌రోల్‌మెంట్ ఐడీ వాడిన వారికి ఈ జరిమానా నుంచి మినహాయింపు ఉంది.


డిసెంబర్ 31, 2025 లోపు ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేయకపోతే, ఆ పాన్‌ కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీని వల్ల బ్యాంకు లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు, పెట్టుబడులు వంటి ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదనంగా ఇనాక్టివ్ అయిన పాన్ తిరిగి యాక్టివ్ చేయాలంటే.. మళ్లీ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అందుకే.. గడువులోగా ఈ పని పూర్తి చేయడం మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com