by Suryaa Desk | Fri, Oct 18, 2024, 09:50 PM
మహబూబాబాద్ జిల్లా, గురువారం రోజున గూడూరు మండల కేంద్రంలో, తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా, బస్టాండ్ సెంటర్ లో ఎంసిపిఐ(యు) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో, ఓంకార చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూకల ఉపేందర్ ఎంసీపీఐ (యు) పార్టీ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. భారత మార్క్ స్ట్ కమ్యూనిస్టు పార్టీ( ఐక్య) ఎం సిపిఐ(యు ) వ్యవస్థాపకులు అసెంబ్లీ టైగర్, నర్సంపేట మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఓంకార్ అమరులై నేటికీ 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నివాళులర్పించారు. ఓంకార్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఏపూరి గ్రామంలో జన్మించారు.
తన 14వ ఏటనే గ్రామంలో భూస్వాములు, పెత్తందారులు నాటి నైజాం పరిపాలనలో కాసిం రిజ్వి సేనలు కొనసాగిస్తున్న దోపిడీ, వెట్టి చాకిరి, బానిసత్వానికి మహిళలపై సాగిస్తున్న దారుణ అకృత్యాలకు వ్యతిరేకంగా, ఆంధ్ర మహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొంది, దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా దళ కమాండర్ గా, నైజాం రజాకారు భూస్వామ్య శక్తుల ఆగడాలపై మడమతిప్పని పోరాటం కొనసాగించారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయాలలో భాగంగా వరంగల్ జిల్లాకు వచ్చి, నర్సంపేట నియోజకవర్గం లో ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై, పేద ప్రజలు ముఖ్యంగా ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం, చట్టసభలలో, బయట అనేక ప్రజా పోరాటాలు నిర్మించి, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడు అని అన్నారు. ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శనీయమని గుర్తు చేస్తూ, కామ్రేడ్ ఓంకార్ ఆశయాలకు కంకణబద్దులమవుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ ( యూ) మండల కార్యదర్శి బంధాల వీరస్వామి, జిల్లా మండల నాయకులు కటకం బుచ్చి రామయ్య, ఈసం రామయ్య, గుండ గాని సత్తయ్య, తేజావత్ శ్రీరామ్, పిట్టల నవీన, నాగెళ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.