![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:04 PM
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కాకా కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని కవిత విమర్శించారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ పదేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వీపీసింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారని గుర్తుచేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదని చెప్పారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారని తెలిపారు. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది.. కానీ ఆ నివేదికను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీ వర్గీకరణ కోసం మోదీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.