|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 09:15 PM
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా.. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న 40 తెలంగాణ రైల్వే స్టేషన్లలో ఉందానగర్ రైల్వే స్టేషన్ ఒకటి. ఉందానగర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి మొత్తం రూ. 12.37 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు 79 శాతం పనులు పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న ఈ పనుల ద్వారా ఉందానగర్ స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పునరాభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ భవనం విస్తరణ , మెరుగైన ప్రయాణికుల వెయిటింగ్ హాల్ , పే అండ్ యూజ్ టాయిలెట్స్ , సురక్షితమైన పార్కింగ్ షెడ్లు , ఎగ్జిట్ ఆర్చ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్-01 వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ముగించారు. వెయిటింగ్ హాల్లో రూఫ్ స్లాబ్, ప్లాస్టర్ పనులు పూర్తి కాగా, స్టేషన్ భవనం విస్తరణలో విండోస్, గ్రానైట్, గ్రిల్ ఫిక్సింగ్ పనులు పూర్తి చేశారు. పార్కింగ్ షెడ్లకు సంబంధించిన ఫౌండేషన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఉందానగర్ రైల్వే స్టేషన్కు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇది హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై ఉంది. ముఖ్యంగా.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల.. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఇది కీలక రవాణా కేంద్రంగా మారనుంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా కేవలం సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా.. ఉందానగర్ వంటి స్టేషన్లు ప్రాంతీయ అనుసంధానతను పెంచడానికి.. స్థానిక ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదపడతాయి. ఈ పునరాభివృద్ధి పనులు పూర్తయితే.. ఈ స్టేషన్ రైల్వే ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని ఇవ్వడంతో పాటు.. తెలంగాణలో రైల్వే ఆధునికీకరణకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.