|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 06:12 PM
భారత్, పాకిస్థాన్లతో అమెరికా సంబంధాలపై ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. పాకిస్థాన్తో కంటే భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. అమెరికాకు పెట్టుబడులను తీసుకొచ్చేది భారత్ తప్ప పాకిస్థాన్ కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ప్రతిభావంతులైన నిపుణులను, ఉద్యోగులను భారత్ అమెరికాకు పంపిస్తోందని ఆయన పేర్కొన్నారు.అమెరికా అభివృద్ధిలో భారతదేశం, అక్కడి నిపుణులు, ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని అన్నారు. భారత్ను అమెరికా దూరం చేసుకోకూడదని, ఒకవేళ అదే జరిగితే అమెరికాకే నష్టమని ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికను భారత్ లెక్కచేయడం లేదని, ఇది అధ్యక్షుడి ఆగ్రహానికి కారణమైందని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దని ట్రంప్ హెచ్చరించినప్పటికీ భారత్ మాత్రం కొనుగోళ్లను ఆపడం లేదని గుర్తు చేశారు. ఇది నచ్చని ట్రంప్, భారత్ పట్ల కఠిన వైఖరిని అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.