|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 07:37 PM
సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, సోయా వంటి వాటితో పోలిస్తే ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా రైతులు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల కలిగే నష్టాలను అధిగమించడానికి పండ్లు, కూరగాయల సాగు ఉత్తమ మార్గమని వివరిస్తున్నారు. రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా భారీగా రాయితీలను కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు.
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందేందుకు వీలుగా సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. బిందు, తుంపర సేద్యం పరికరాల కొనుగోలుపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం మేర రాయితీ కల్పిస్తున్నారు. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి సేద్యపు కుంటల నిర్మాణానికి ఎకరానికి రూ. 8 వేల వరకు సబ్సిడీ అందిస్తుంది. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం ద్వారా మామిడి, జామ, నిమ్మ, ఆయిల్పామ్ వంటి పండ్ల తోటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందుతున్నాయి. పూల తోటల సాగులో ప్లాస్టిక్ మల్చింగ్ను ప్రోత్సహించడానికి రాయితీలు ఇస్తున్నారు. అలాగే, కూరగాయల సాగును తక్కువ పెట్టుబడితో లాభసాటిగా మార్చేందుకు రైతులకు నాణ్యమైన హైబ్రిడ్ నారును రాయితీపై సరఫరా చేస్తున్నారు.
తీగజాతి కూరగాయల సాగును విస్తరించేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ప్రభుత్వం ప్రత్యేక చేయూతనిస్తోంది. పందిళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీగా అందిస్తోంది. ఒక హెక్టారు (సుమారు 2.50 ఎకరాలు) పరిధిలో పందిళ్లు నిర్మించుకునే రైతుకు గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు రాయితీ లభిస్తుంది. దీనివల్ల తీగజాతి కూరగాయల నాణ్యత పెరిగి రైతులకు మంచి ధర లభిస్తుంది. పొలం గట్ల మీద వెదురు నాటడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందేలా రాష్ట్ర వెదురు మిషన్ కృషి చేస్తోంది. దీని కింద వెదురు మొక్కలను 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఎకరానికి గరిష్ఠంగా 130 మొక్కల వరకు ఈ సబ్సిడీ పొందే అవకాశం ఉంది. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత డివిజన్ కార్యాలయాలను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అంటున్నారు.