|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:59 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రెండో రోజు కూడా జోరుగా కొనసాగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకొని ఓటును అభ్యర్థించారు.ఆలేరు మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని తెలిపారు.అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సాగుకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి వారి దైనందిన ఖర్చులను తగ్గించింది. పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ గృహ వ్యయాన్ని తగ్గిస్తోంది.యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోంది. మున్సిపాలిటీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.