|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:22 PM
హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్ హిల్స్లోని తెలంగాణలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు సిబ్బంది భవనంలో ఉండగా.. వారిలో ఒకరు గాయపడినట్లు తెలిసిందే. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరొకరు సురక్షింతగా బయటపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను పోలీసులు మళ్లిస్తున్నారు. ఈ ప్రయోగశాల నాంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, పది రోజుల క్రితం నాంపల్లి బచాస్ ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నీచర్ దుకాణంలోని సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అప్పటికే సెల్లార్లో వాచ్మెన్ ఇద్దరు పిల్లలు, మరో మహిళ ఉండిపోయారు. వారు బయటకు వచ్చేందుకు దారి లేకపోవటంతో వారిని రక్షించేందుకు అక్కడే పని చేసే మరో ఇద్దరు యువకులు వెళ్లారు. ఆ ముగ్గుర్ని రక్షించే క్రమంలో దట్టమైన పొగ కమ్ముకొని వారికి దారి కనిపించలేదు. అక్కడ ఫర్నీచర్ తయారీకి వాడే ఫోమ్, ఇతర సామాగ్రి ఉండటంతో మంటల తీవ్రత పెరిగింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటన తర్వాత హైడ్రా నగరంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది సెల్లార్లు ఆక్రమస్తే బిల్డింగులు సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు పలు దుకాణాలు సీజ్ చేసింది కూడా. అయితే కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం సెల్లార్లను కూడా వదలకుండా కమర్షిల్ పర్ఫస్ కోసం వాడుకుంటున్నట్లు తెలిసింది. దీంతోనే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు.