తిరుపతి నగరంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. నాలుగు ఇళ్లను ఒకేసారి బద్దలు కొట్టిగా దొంగలు ఏకంగా 1.048 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తిరుపతిలో ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా నాలుగు ఇళ్లను కేటుగాళ్లు దోపిడీ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసిన దుండగులు అక్రమంగా ప్రవేశించారు. వరసగా 80, 81, 82, 83 ఫ్లాట్లలో చోరీకి పాల్పడ్డారు. 81వ ఫ్లాట్ యజమాని మేఘనాథ్ రెడ్డి ఇంటిపైన నిద్రిస్తుండగా అతని ఇంటిలో కేజీ బంగారాన్ని అపహరించారు. కేశవుల నాయుడు అనే వ్యక్తికి చెందిన 82వ ఫ్లాట్లోనూ చోరీ జరిగింది. ఆ ఇంటికి కన్నం వేసిన దొంగలు 48 గ్రాముల గోల్డ్ ఎత్తుకెళ్లారు.
80, 83 ఇళ్లను యజమానులు గెస్ట్ హౌస్లుగా వాడుకుంటున్నారు. అయితే వాటి తలుపులను సైతం దుండగులు బద్దలు కొట్టారు.ఉదయాన్నే చోరీని గమనించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ బంగారాన్ని ఎలాగైనా తిరిగి అప్పగించాలని పోలీసులను బాధితులు వేడుకున్నారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు తిరుపతిలో కలకలం రేపుతోంది. దొంగల సంచారంతో నగర ప్రజలు హడలిపోతున్నారు.