|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:00 PM
గూగుల్, తన మ్యాప్స్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యంతో గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో అనుసంధానం కానుంది. దీని ద్వారా యూజర్లు ఇకపై నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సేవలను వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా ఓ కొత్త మార్గంగా మారనుంది. ఉదాహరణకు, ఓ యూజర్ గూగుల్ మ్యాప్స్లో గాజువాక నుంచి భీమవరం వెళ్లాలని సెర్చ్ చేస్తే.. కారు, బైక్, రైలుతో పాటు బస్సు ప్రయాణ వివరాలు కూడా కనిపిస్తాయి. అక్కడ బస్ సింబల్పై క్లిక్ చేయగానే, ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వివరాలు, అవి బయలుదేరే సమయాలు, గమ్యస్థానానికి చేరే సమయం వంటివి ప్రదర్శితమవుతాయి.యూజర్ తనకు నచ్చిన బస్సును ఎంపిక చేసుకొని బుకింగ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే, అది నేరుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్కు రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ ప్రయాణికుల వివరాలు నమోదు చేసి, ఆన్లైన్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని సుమారు మూడు నెలల క్రితమే విజయవాడ - హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, రాష్ట్రంలోని అన్ని రిజర్వేషన్ సర్వీసుల (ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్) వివరాలను ఆర్టీసీ అధికారులు గూగుల్కు అందజేశారు.గూగుల్ మ్యాప్స్ ఇటీవలే ఏఐ (AI) ఆధారిత నావిగేషన్, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం, మెరుగైన ట్రాఫిక్ అలెర్ట్లు వంటి అనేక ఫీచర్లను జోడించింది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీతో అనుసంధానం కావడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరింత మెరుగైన, సులభతరమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది.