|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 07:18 PM
భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అయినప్పటికీ.. రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పంట పండించిన తర్వాత కూడా, దాన్ని సరియైన ధరకు విక్రయించడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. సాగు వ్యయం పెరగడం , అకాల వర్షాలు, సరైన మద్దతు ధర లేకపోవడం వంటి సమస్యలు రైతులను ఆర్ధికంగా కుంగదీస్తున్నాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవాల్సి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, తెగుళ్ల వంటివి పెట్టిన పెట్టుబడిని పాడు చేస్తుంటాయి.
ఈ కష్టాలన్నీ తట్టుకుని పంట పండిస్తే.. దానిని సరైన ధరకు అమ్ముకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు . దీంతో అప్పుల భారం పెరిగి.. చాలా మంది రైతులు రుణ సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రైతుల కష్టాన్ని కొంతైనా తగ్గించే లక్ష్యంతో, ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
రైతులు పండించిన ధాన్యాన్ని అందుబాటులో విక్రయించుకునేందుకు, మద్దతు ధరకు అమ్ముకునేందుకు ఈ కేంద్రాలు వేదికగా నిలుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన.. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కొత్తగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కొనుగోలు కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
తూకంలో తేడాలు, హమాలీలు అధిక డబ్బులు వసూలు చేయడం, కొనుగోళ్లు ఆలస్యం కావడం వంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు హెచ్చరిక: రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ అధికారులకు ఆయన సూచించారు. రైతుల నుంచి హమాలీలు అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని దండు నరసింహ హెచ్చరించారు.
తమ సమస్యలు అడిగి తెలుసుకుని, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పెద్దకొత్తపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ సిరాజు, రాము, మార్కెట్ కమిటీకి చెందిన ప్రసాద్, మరియు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ ఈ సందర్భంగా కోరారు.