|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:42 PM
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న బస్సు, బదర్-మదీనా మధ్యలోని ముఫరహత్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న యాత్రికులు సజీవ దహనమయ్యారని వెల్లడించాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని, కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.