|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:04 PM
తెలంగాణలోని స్టార్టప్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టార్టప్ల అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధిని సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో గూగుల్ వంటి పెద్ద సంస్థలుగా ఎదగాలని ఆయన స్టార్టప్లకు పిలుపునిచ్చారు.బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో ఏర్పాటు చేసిన 'గూగుల్ ఫర్ స్టార్టప్' హబ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. "1998లో ఇద్దరు స్నేహితులు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజ్లో ప్రారంభించిన స్టార్టప్, ఈరోజు ప్రపంచ దిగ్గజం గూగుల్గా నిలిచింది. అదే స్ఫూర్తితో మన స్టార్టప్లు కూడా ఎదగాలి" అని ఆయన అన్నారు.ప్రొడక్ట్ ఆధారిత, వినూత్నమైన స్టార్టప్లపై యువత దృష్టి సారించాలని సీఎం సూచించారు. గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు 20 ఏళ్ల క్రితం చిన్న స్టార్టప్లుగా మొదలై ఇప్పుడు బిలియన్ డాలర్ల కంపెనీలుగా మారాయని గుర్తుచేశారు. "హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్గా మిగిలిపోకూడదు. ఇక్కడి నుంచి కనీసం 100 స్టార్టప్లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు.