|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:36 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (డిసెంబర్ 10) ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూకు రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాండా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.45 లక్షల చెక్కు అందజేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర ‘సర్వం సిద్ధం’ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు, విద్యార్థి నాయకులతో పాటు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కాశీం.. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'విద్యను రేవంత్ ప్రేమించారు..'
తన ప్రసంగంలో సీఎం రేవంత్ గురించి ప్రస్తావించిన ప్రొఫెసర్ కాశీం.. 1965లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్ట్స్ కాలేజీ మెట్లు క్కిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అన్నారు. కానీ ఇటీవల మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో విద్య గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. విద్యపై ప్రేమను రేవంత్ రెడ్డి.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రొఫెసర్ కాశీం చేసిన వ్యాఖ్యలపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చదువును సరస్వతి తల్లిగా కొలుస్తారని.. అలాంటిది విద్యను ఒక అమ్మాయి అనడం.. ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు అనడం ప్రొఫెసర్ కాశీం భావ దారిద్ర్యాని నిదర్శనమని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎవరినైతే తెలంగాణ ప్రజలు బుద్ధిజీవులు అనుకున్నారో.. వారే వారి స్వప్రయోజనాల కోసం ఒక తెలంగాణ వ్యతిరేకిని ఇలా పొగుడుతున్నారన్నారని మండిపడ్డారు.
మరోవైపు, చింతకింది కాశీం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)తో సంబంధాలు కలిగి ఉన్నారని.. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు 2020 జనవరి 18న అరెస్టు చేశారు. ప్రస్తుతం కండిషనల్ బెయిల్పై ఉన్నారు. కాగా, కాశీం విప్లవకవిగా, సాహిత్య విమర్శకుడిగా పేరు పొందారు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలోనూ చింతకింది కాశీం పాల్గొన్నారు. గ్రామాల్లో తిరిగి తన ఉపన్యాసాలతో ఉద్యమంలో పని చేశారు.