|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:31 PM
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక ఒప్పందం జరిగింది. నగరంలో ప్రఖ్యాత లగ్జరీ హోటళ్లలో ఒకటైన 'తాజ్ బంజారా'ను అమ్మేశారు. అరోబిందో గ్రూప్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ.. ఆరో రియాల్టీ ఈ హోటల్ ప్రాపర్టీని రూ. 315 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 31న దీనికి సంబంధించిన లావాదేవీలు పూర్తైనట్లు సమాచారం. నగరంలో జరిగిన ముఖ్యమైన ఒప్పందాల్లో ఒకటిగా ఈ తాజ్ బంజారా డీల్ నిలిచిందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజ్ బంజారా కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ. 17.3 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
కాగా, హోటల్ బంజారా లిమిటెడ్ సంస్థకు చెందిన ఈ తాజ్ బంజారా.. 16,645 చదరపు యార్డ్స్ విస్తీర్ణం కలిగిన ల్యాండ్ పార్సల్లో ఉంది. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి. అయితే, గత రెండు సంవత్సరాలుగా పన్నులు చెల్లించకపోవడంతో.. ఈ ఏడాది ప్రారంభంలో జీహెచ్ఎంసీ అధికారులు తాజ్ బంజారాను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంత మొత్తంలో పన్నులు చెల్లించడంతో తిరిగి ప్రారంభమైనట్లు సమాచారం.
మరోవైపు, కొత్తగా కొనుగోలు చేసిన ప్రాపర్టీని ఆరో రియాల్టీ ఎలా ఉపయోగించుకోనుంది అనే విషయంపై ఆ కంపెనీ వివరాలు వెల్లడించలేదు. కాగా బంజారా హిల్స్.. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ విలాసవంతమైన నివాస ప్రాంతాలు, లగ్జరీ హోటళ్ళు, కార్పొరేట్ కార్యాలయాలు, ప్రీమియం రిటైల్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. చాలా మంది ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. 2025 ప్రారంభం నుంచి బంజారాహిల్స్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ డేటా ప్రకారం.. బంజారా హిల్స్లో ధరలు ఈ ఏడాది సుమారు 8 శాతం పెరిగాయి. సగటున చదరపు అడుగుకు రూ. 12,000– రూ. 15,000 పెరిగాయట.
ఇంతకుముందు కూడా తాజ్ బంజారా లాంటి కీలక ఒప్పందాలు జరిగాయి. డిసెంబర్ 2న వీవర్క్ ఇండియా అనే కంపెనీ.. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న స్కైవ్యూ 20 టెక్ పార్క్లో.. 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఐదు సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకుంది. అందుకోసం రూ. 1.72 కోట్ల ప్రారంభ నెలవారీ అద్దె చెల్లించనుంది. అయితే ఇందులో రెండు అంతస్తుల స్థలాన్ని జేపీ మోర్గాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 60 నెలల పాటు.. రూ. 4.38 కోట్ల ప్రారంభ నెలవారీ అద్దెకు సబ్-లీజుకు ఇవ్వడం గమనార్హం.