|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 07:52 PM
ప్రస్తుత ప్రపంచం కృత్రిమ మేధ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో.. ఈ విప్లవాత్మక రంగంలో దేశ యువతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ , మై భారత్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో 'యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన ప్రోత్సాహం, మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వయసు ఒక ప్రధాన అర్హత.13 నుంచి 21 సంవత్సరాల లోపు వయసు ఉన్న విద్యార్థులు అర్హులు. ఎనిమిదో తరగతి చదువుతున్న వారి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న యువత వరకు పాల్గొనవచ్చు. విద్యార్థులు ఒంటరిగా లేదా ఇద్దరు సభ్యులు గల బృందంగా ఏర్పడి ఈ పోటీలలో పాల్గొనాలి. తెలంగాణలోని విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా పేర్కొనవచ్చు.
ఆసక్తి గల విద్యార్థులు https:/impact.indiaai.gov.in/eventsyuvaai అనే వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించేవారికి ఈ పోటీలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా.. పరిజ్ఞానం, సృజనాత్మకత ఆలోచనలు, బాధ్యతాయుత వినియోగ పద్ధతులు వంటి అంశాలు కీలకంగా ఉండనున్నాయి. ప్రాజెక్టులు రూపొందించాల్సిన కొన్ని ముఖ్యమైన రంగాల్లో ముఖ్యంగా.. సోషల్ ఎంపవర్ మెంట్, ప్రాథమిక రంగాలు అంటే.. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా. దీంతో పాటు.. సుస్థిర నగరాలు, గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.
ఈ ఛాలెంజ్లో విజేతలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నగదు బహుమతులను ప్రకటించింది.. ఇది యువ ఆవిష్కర్తలకు గొప్ప ప్రోత్సాహంగా చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.15 లక్షలు చొప్పున అందజేస్తారు. ద్వితీయ స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.10 లక్షలు చొప్పున అందజేయనుండగా.. ప్రత్యేక బహుమతి కింద రెండు బృందాలకు రూ.5 లక్షలు చొప్పున అందజేస్తారు.
ఎంపికైన బృందాలను ప్రాథమిక ఎంపిక, ప్రాజెక్టు మెరుగుదల, ముఖాముఖి ఆధారంగా తుది విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. నిపుణుల పరిశీలనలో ఉత్తమంగా నిలిచిన ప్రాజెక్టులను ప్రభుత్వం దత్తత తీసుకుని.. వాటిని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరిస్తుంది. విజేతలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఢిల్లీ) ఆధ్వర్యంలో జరిగే ఏఐ నిపుణుల కార్యశాలలో కూడా పాల్గొనవచ్చు. ఇది భవిష్యత్తులో వారికి ఏఐ రంగంలో ఉద్యోగాలు, రీసెర్చ్ అవకాశాలను మెరుగుపరుస్తుంది.