|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:29 PM
ఆత్మాహుతి దాడిని "అమరత్వం"గా అభివర్ణిస్తూ ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ ఉన్-నబీ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మాహుతి (ఆత్మహత్య) 'హరామ్' (నిషిద్ధం) అని, అమాయకులను చంపడం ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఉగ్రవాదమే తప్ప మరేమీ కాదని తేల్చి చెప్పారు.ఈ మేరకు ఒవైసీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి దాడిని సమర్థిస్తున్న పాత వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం, అమాయకులను చంపడం మహా పాపం. ఇవి దేశ చట్టాలకు కూడా విరుద్ధం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇది కచ్చితంగా ఉగ్రవాదమే" అని పేర్కొన్నారు.అదే సమయంలో, దేశ రాజధాని సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు దొరకడం, కొత్త ఉగ్రవాద ముఠా వెలుగు చూడటంపై ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గత ఆరు నెలల్లో కశ్మీర్లో స్థానికంగా ఎవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు హామీ ఇచ్చారు. మరి ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని నిలదీశారు.