|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:36 PM
పటాన్చెరు : అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిల్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పటాన్చెరు అమీన్పూర్ సర్కిల్ల పరిధిలోని డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలపై చర్చించారు. ప్రధానంగా మినీ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇండోర్ స్టేడియం, అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న వార్డు కార్యాలయాన్ని ప్రత్యేకతను పూర్తి చేయాలన్నారు.
ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలోగల వివేకానంద స్టేడియం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 కోట్ల రూపాయలు మంజూరు చేశాయని.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో స్లాటర్ హౌస్ (పశు వదశాల) నిర్మించబోతున్నట్లు తెలిపారు. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో..ఆధునిక వసతులతో.. నూతన టెక్నాలజీతో నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములలో లేఔట్లు, అనుమతి లేని నిర్మాణాలు, అక్రమంలో కొనసాగకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ .. కబ్జాదారుల పైన ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, పటాన్చెరు ఎమ్మార్వో హరిబాబు, రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, విద్యుత్ శాఖ డి ఈ భాస్కరరావు, నీటిపారుదల శాఖ ఈ ఈ భీమ్, డి ఈ రామస్వామి, జిహెచ్ఎంసి ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.