|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:31 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ఆధారంగా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న జిల్లాల రద్దు అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై తాజాగా సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏ జిల్లాను తొలగించదని అన్నారు. కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కచ్చితంగా బహిరంగంగా ప్రజలకు చెప్పి, అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా.. భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదని ఇది తన హామీ అని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. భూపాలపల్లి అప్పట్లో కుగ్రామంగా ఉన్న సమయంలో అప్పటి సీఎం నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చారని గుర్తు చేశారు. అ తర్వాత సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి ఇక్కడే వేశారన్నారు. దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదని.. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందన్నారు. భూపాలపల్లి జిల్లాను తమ ప్రభుత్వం రద్దు చేయబోతోందని ఇటీవల కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ జిల్లాను తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు.
కొందరు చిల్లర రాజకీయాలను చేస్తున్నారని.. రాజకీయ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నారన్నారు. సింగరేణి కార్మికుల విషయంలో మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్ముతున్నారన్నారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఇలాంటి వారిని మోకాళ్లపై కూర్చొబెడుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింగరేణిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉందన్నారు.