by Suryaa Desk | Fri, Oct 11, 2024, 06:36 PM
తాగునీటిలో చీమో, బొద్దింకో కనిపిస్తేనే.. కడుపులో దేవినట్లు అవుతుంది. అలాంటిది గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కనిపించింది. 10 రోజులుగా గ్రామస్థులు అవే నీటిని తాగుతున్నారు. నీటి ట్యాంకులో కోతి కళేబరం కనిపించిన విషయం తెలుసుకొని ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీరు దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి గ్రామస్థులు ట్యాంకును పరిశీలించారు. అందులో చనిపోయిన కోతి ఉన్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి ట్యాంకు నుంచి కోతి కలేబరాన్ని బయటకి తీశారు. అనంతరం నీటి ట్యాంకును ఖాళీ చేసి, శుభ్రం చేశారు. కోతి కళేబరం ఉన్న నీటిని తాగిన గ్రామస్థులు తమకు ఏవైనా రోగాలు సోకుతాయేమోనని ఆందోళనకు గురవుతున్నారు. కలుషిత నీటిని సరఫరా చేసిన సిబ్బందిపై మండిపడుతున్నారు.
కోతి తాగునీటి కోసం ప్రయత్నించి ట్యాంకులో పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. లేకపోతే.. కోతులు పరస్పరం కీచులాడుకున్న సందర్భంలో ట్యాంకులో పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సిబ్బంది ట్యాంకుకు మూత సరిగా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునసాగర్లో తాగునీటి ట్యాంకులో 30 కోతులు
గతంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. నాగార్జునసాగర్ మునిసిపాలిటీ పరిధిలోని విజయవిహార్ కాలనీ 1వ వార్డులోని మంచి నీటి ట్యాంకులో నుంచి 30 కోతుల కళేబరాలను బయటకి తీశారు. పది రోజుల పాటు అవే నీటిని తాగిన కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
5000 లీటర్ల సామర్థ్యం గల మంచి ట్యాంకు ద్వారా సుమారు 150 ఇళ్లకు తాగునీరు సరఫరా అవుతుండగా.. కొన్ని రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు రావడాన్ని గ్రామస్థులు గమనించారు. ఆ తర్వాత నీరు దుర్వాసన రావడం, చిన్న చిన్న మాంసపు ముక్కలు కూడా రావడంతో ఆందోళనకు గురయ్యారు. కొంత మంది యువకులు ట్యాంకు పైకెక్కి చూడగా.. భయానక సీన్ కనిపించింది. నీటి లోపల 30 వరకు కోతులు పడిపోయి చనిపోయి ఉన్నాయి. మునిసిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి ట్యాంకును క్లీన్ చేశారు.
ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. మరికొన్ని కోతులు దాడి చేసేందుకు ఎగబడటం గమనార్హం. కోతులు వెళ్లిపోయిన తర్వాత.. ట్యాంకులోని కళేబరాలను బయటకు తీసి శుభ్రం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.