by Suryaa Desk | Tue, Oct 08, 2024, 06:44 PM
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నేటి ఎన్నికల ఫలితాలతో కొన్ని అంశాల్లో స్పష్టత వచ్చిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు.2029 ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్కు దూరంగా ఆగిపోతాయన్నారు. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయన్నారు. దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.ఐదు హామీల పేరుతో కర్ణాటకలో, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో, 10 హామీలతో హిమాచల్ ప్రదేశ్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి హర్యానా ప్రజలు మాత్రం బుద్ధి చెప్పారని, వారి అబద్ధపు హామీలను నమ్మలేదని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు అన్ని విధాలుగా అనుసంధానమైందని, ఇలాంటి పరిస్థితుల్లో హామీలను అమలు చేయకుంటే నష్టం తప్పదని కాంగ్రెస్ పార్టీకి అర్థమై ఉంటుందన్నారు.