by Suryaa Desk | Sun, Oct 06, 2024, 07:56 PM
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. వర్షంతో పాటుగా భారీ స్థాయిలో ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
నేడు జోగులాబం గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈనెల 7న మేడ్చల్ మల్కాజిగిరి, భూపాలపల్లి, హైదరాబాద్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగాం, నాగర్కర్నూల్, నారాయణపేట, వరంగల్, హనుమకొండ, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈనెల 8న తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇక హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణ ఉంటుందని చెప్పారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రానికి పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. శనివారం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురవటంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.