by Suryaa Desk | Sat, Oct 05, 2024, 07:06 PM
ఖరీఫ్ సీజన్ 2024 ధాన్యం కొనుగోలులో సన్న రకం క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో సన్న రకం, దొడ్డు రకాలు వేర్వేరుగా సేకరించేందుకు తీసుకుంటున్న చర్యలు, గన్ని సంచుల లభ్యత, వరి సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంట దిగుబడి, వాటిని ఏ రైస్ మిల్లులకు పంపుతారు మొదలగు వివరాలను కొనుగోలు కేంద్రాల వారిగా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో, వీటి కొనుగోలుకు 258 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సన్న రకం ధాన్యాలు జిల్లాలో 24 వేల 600 క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనాలు రూపొందించామని, ఏ గ్రామాలలో సన్న రకం దాన్యం సాగు చేశారో, అక్కడి కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రత్యేక కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, సన్న రకం దాన్యం బ్యాగులపై ఆ నెంబర్ వేయాలని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ మాసం ఎంత ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారిగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్ లో గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2320 , సాధారణ రకం ధాన్యానికి 2300 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు , టార్ఫాలిన్లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారు పూర్తి వివరాలు నివేదిక అందజేయాలని కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సజావుగా కొనుగోలు జరిగేలా కనీసం అయిదుగురు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు మొత్తం 75 లక్షల గన్ని సంచులు అవసరం ఉన్నాయని, ప్రస్తుతం మన దగ్గర 25 లక్షల 5 వేల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. మిల్లర్ల వద్ద నుంచి మరో 18 లక్షల గన్ని సంచులను సేకరించాలని, మిగిలిన సంచులను త్వరగా సేకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ యంత్రాలను పరీక్షించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చే షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు దగ్గరే ధాన్యం నాణ్యతను కట్టుదిట్టంగా పరిశీలించాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండడానికి వీలులేదని ఝా తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం సన్న రకాల ధాన్యాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి వ్యవసాయ విస్తరణ అధికారితో సమన్వయం చేసుకుంటూ గుర్తించాలని, వీటిని కోనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకంగా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు వీలుగా అవసరమైన మేర వాహనాలు సన్నద్దం చేయాలని తెలిపారు.
ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కు సంబంధించిన నివేదిక సమర్పించాలని, దాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టి , రోడ్డు ప్రమాదాలకు దారి తీయకుండా చూడాలన్నారు. రైతులకు టోకెన్ పద్ధతి లో మాత్రమే ధాన్యం సెంటర్ కు తీసుకొని వచ్చి, కొనుగోలు చేసే విధంగా చూడాలని అన్నారు. ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ , పిడి డిఆర్డిఏ శేషాద్రి, అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, సివిల్ సప్లై అధికారి వసంత లక్ష్మి, డి.ఎం. మార్కెటింగ్ ప్రకాష్, డిఎం సివిల్ సప్లై రజిత, డి.సి.ఓ. రామకృష్ణ, లీగల్ మెట్రాలజీ, డి.పి.ఎం.లు, ఏ.పి.ఎం.లు, సి.సి.లు, ప్యాక్స్ సెంటర్ ప్రతినిధులు, రైస్ మిల్లుల ప్రసిడెంట్లు, అధికారులు పాల్గొన్నారు.