by Suryaa Desk | Wed, Oct 02, 2024, 06:50 PM
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకూ వ్యక్తిగతం అవుతున్నాయి. తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఆమె, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై.. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా మరిన్ని సంచలన విమర్శలు చేశారు. అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని పేర్కొన్న కొండా సురేఖ.. తాజాగా మరిన్ని విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయలేదని చెప్పిన కొండా సురేఖ.. దానికి కారణం కేటీఆర్ పెట్టిన ఒక కండీషన్ అని పేర్కొ్న్నారు. అయితే అప్పుడు అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్యగా ఉన్న సమంత విషయంలో కేటీఆర్ ఒక షరతు పెట్టినట్లు కొండా సురేఖ చెప్పారు. ఆ కండీషన్కు ఒప్పుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపుతామని చెప్పారని.. ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి తీసుకువచ్చిందని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పిన కొండా సురేఖ.. సినిమా ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కేటీఆర్ కారణమని పేర్కొన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు. ఈ విషయం టాలీవుడ్లోని పెద్దలందరికీ తెలుసని పెద్ద బాంబ్ పేల్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతోపాటు టాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. అయితే ఈ విషయాలన్నీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న అధికార వర్గాల ద్వారా తమకు తెలిసినట్లు కొండా సురేఖ చెప్పారు. వాటికి సంబంధించిన కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు.