by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:21 PM
మియాపూర్ సర్వేనం100,101, మక్తమహబూబ్ పేట్ సర్వే నం 44 లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రజల ఆస్తులు కాపాడాలని జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు.ఈమేరకు బుద్దభవన్ లోని హైడ్రా కార్యాలయంలోమంగళవారం కమిషనర్ రంగనాథ్ కు ఆధారాలతోసహా పిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మియాపూర్ సర్వేనం 100,101 , మక్త మహబూబ్ సర్వే నం 44 ప్రభుత్వ భూములపై సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉన్నది. అయితే భూబకాసురులు బై నంబర్లు వేసి తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్నారు. మియాపూర్ బస్ డిపో వెనకాల భారీ ఎత్తున బాజాప్తాగా రూములు, కాంపౌండ్ వాల్ కట్టి సుమారు 2 ఎకరాలు కబ్జాచేశారన్నారు. అన్ని ఆధారాలతో ఫిర్యాదుచేసినా సంబంధిత అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నారు. గతంలో ఈ విషయమై రంగారెడ్డి కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. సుమారు రూ.200 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనంచేసుకోవాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు.