by Suryaa Desk | Sun, Sep 29, 2024, 11:28 PM
హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతాలను తాకుతూ అభివృద్ధి చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో నగరం నలుదిక్కుల ఇళ్లు, భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పుడు ఇళ్లు కొనుగోలు మరింత భారంగా మారుతోంది. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 32 శాతం పెరిగినట్లు తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల వివరాలతో కూడిన ఓ నివేదికను విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఢిల్లీ- ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 29 శాతం మేర పెరిగినట్లు అనరాక్ నివేదిక తెలిపింది. బలమైన డిమాండ్, నిర్మాణ వ్యయాలు పెరగడం, లగ్జరీ ఇళ్ల సరఫరా పెరగడం వంటివి ఇళ్ల ధరలు పెరిగేందుకు కారణమైనట్లు అనరాక్ తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సగటు రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు 29 శాతం పెరిగినట్లు తెలిపింది. గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,570 వద్ద ఉండగా.. అది ఇప్పుడు రూ.7,200 స్థాయికి చేరినట్లు తెలిపింది. ఇక బెంగళూరు విషయానికి వస్తే సగటు చదరపు అడుగు ధర 29 శాతం పెరిగింది. అంతకు ముందు ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు స్క్వేర్ ఫీట్ ధర రూ.6,275 ఉండగా.. ఇప్పుడు అది రూ.8,100కు చేరినట్లు నివేదిక తెలిపింది.
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఢిల్లీ, బెంగళూరును మించి పెరిగాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు స్క్వేర్ ఫీట్ ధర రూ.7,150 కి చేరినట్లు అనరాక్ నివేదిక తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో చదరపు అడుగు ధర సగటున రూ.5,400 పలికేదని, అది 32 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. ఇక ముంబై మెట్రోపాలిటన్ రీజినయ్లో ఇళ్ల ధరలు సగటున 24 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.13,150 నుంచి రూ.16,300లకు చేరినట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత పుణెలో ఇళ్ల ధరలు 16 శాతం వృద్ధితో రూ.6,550 నుంచి రూ.7.600 చదరపు అడుగు ధరకు చేరుకున్నాయి. అలాగే చెన్నైలోనూ 16 శాతం పెరిగి రూ.5,770 నుంచి రూ.6680 స్థాయికి చేరాయి. కోల్కతాలో 14 శాతం వృద్ధితో రూ.5000 నుంచి రూ.5,700 స్థాయికి చేరాయి.