by Suryaa Desk | Tue, Oct 01, 2024, 01:43 PM
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం బోనకల్లు పోలీస్ స్టేషన్ పనితీరు ను పరిశీలించేందుకు అకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే అర్జీల విచారణ కోసం అప్పగించే భాధ్యతలను సెక్టార్ పోలీస్ అధికారులకు సిరియస్ గా తీసుకొని విచారణ చేపట్టాలని అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. ప్రతి కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, తద్వారా బాధితులకు సరియైన న్యాయం జరుగుతుందని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలని, సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా నియంత్రించేందుకు రాత్రి గస్తీ, పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన విచారణ నివేదికలను, రికార్డులను ఈ సందర్భంగా పరిశీలించారు.